Crop Holiday in Aqua Industry: ఆక్వా రైతు ఆక్రందన - ఆదుకోకుంటే పంట విరామమే.. ప్రభుత్వానికి రైతుల అల్టిమేటం!
AP Aqua Farmers Protest: ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల అత్యవసర సమావేశం అమలాపురంలో జరిగింది. సిండికేట్ వ్యవస్థను అరికట్టి, రొయ్యల ధరలను నియంత్రించకపోతే పంట విరామం ప్రకటిస్తామని రైతులు హెచ్చరించారు.

Shrimp Prices Drop Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టే కీలకమైన ఆక్వా రంగం ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. సిండికేట్ల దెబ్బకు కుదేలవుతున్న ఆక్వా రైతాంగాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోకపోతే, రాష్ట్రవ్యాప్తంగా పంట విరామం ప్రకటిస్తామని ఆక్వా రైతుల రాష్ట్ర సమన్వయ కమిటీ అల్టిమేటం జారీ చేసింది. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో శుక్రవారం జరిగిన రాష్ట్ర స్థాయి అత్యవసర సమావేశంలో రైతులు తమ ఆవేదనను, డిమాండ్లను వెల్లడించారు.
సిండికేట్ వల్ల సమస్యలు
డాలర్ల పంటగా పేరుగాంచిన ఆక్వా పరిశ్రమను సిండికేట్ వ్యవస్థలు పట్టి పీడిస్తున్నాయి. అమలాపురంలో జరిగిన ఆక్వా రైతు సంఘాల సమావేశంలో రైతులు ముక్తకంఠంతో తమ నిరసనను వ్యక్తం చేశారు. ఎగుమతిదారులు , మేత తయారీదారులు, హేచరీల యజమానులు ఒక సిండికేట్గా ఏర్పడి ధరలను శాసిస్తున్నారని, దీనివల్ల సామాన్య రైతు నిలువునా మునిగిపోతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన స్పందించకపోతే, ఆక్వా సాగును నిలిపివేయడం మినహా తమకు మరో మార్గం లేదని స్పష్టం చేశారు.
విత్తనం దశ నుంచే మోసం
ఆక్వా సాగులో విత్తనం దశ నుంచే మోసం మొదలవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. కొన్ని హేచరీలు నాణ్యత లేని సీడ్ను పంపిణీ చేయడం వల్ల పంట ఆరంభంలోనే దెబ్బతింటోందని వారు పేర్కొన్నారు. దీనికి తోడు, మేత ధరలు అమాంతం పెంచి రైతుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. ఇటీవల మేత ధరల పెరుగుదలపై రైతులు నిరసన తెలపడంతో, దానికి ప్రతీకారంగా ఎగుమతిదారులు రొయ్యల కొనుగోలు ధరలను కిలోకు రూ. 50 వరకు తగ్గించేశారని, దీనివల్ల టన్నుకు రూ. 50 వేల చొప్పున రైతులు భారీగా నష్టపోతున్నారని గణాంకాలతో వివరించారు.
విద్యుత్ సబ్సిడీ కూడా సమస్యే
విద్యుత్ సబ్సిడీ విషయంలో కూడా ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని రైతులు ధ్వజమెత్తారు. ఆక్వా జోన్, నాన్-ఆక్వా జోన్ అనే తేడాలు లేకుండా సాగు చేసే ప్రతి రైతుకు సబ్సిడీ విద్యుత్తును అందించాలని వారు డిమాండ్ చేశారు. గతంలో నిలిపివేసిన నాన్-ఆక్వా జోన్ పరిధిలోని 12 వేల విద్యుత్ కనెక్షన్లకు సబ్సిడీని తక్షణమే పునరుద్ధరించాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పరిమితులు ఆక్వా సాగును మరింత భారంగా మారుస్తున్నాయని, ఇది అంతర్జాతీయ మార్కెట్లో మన రొయ్యల పోటీతత్వాన్ని దెబ్బతీస్తుందని హెచ్చరించారు.
ప్రభుత్వంతో చర్చించేందుకు కమిటీ ఏర్పాటు
రాష్ట్రవ్యాప్తంగా ఆక్వా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్ర ఆక్వా రైతు సమన్వయ కమిటీ ని ఈ సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా గొట్టిముక్కల గాంధీ భగవాన్ రాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన ఆక్వా ప్రతినిధులు ఈ కమిటీ ద్వారా ప్రభుత్వానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించనున్నారు. ఇచ్చిన గడువులోగా సమస్యలు పరిష్కారం కాకపోతే, రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆక్వా సాగును నిలిపివేసి నిరసన తెలుపుతామని వారు తేల్చిచెప్పారు.
ఈ సమావేశంలో భీమవరం, కోనసీమ, కైకలూరు, ప్రకాశం, ఏలూరు వంటి ప్రధాన ఆక్వా సాగు జిల్లాల నుంచి భారీగా రైతు నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వంపై తాము ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారలేదని వారు విమర్శించారు. ఎగుమతిదారుల ఆగడాలను కట్టడి చేయకపోతే, రాబోయే రోజుల్లో ఏపీ ఆక్వా రంగం కుప్పకూలడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
Before You Go
Viral Video of a Man Wearing Leaf Helmet | ఎండ దెబ్బకి ఇతడేం చేశాడో చూడండి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















