AP Wedding Rush: మూడు నెలలుగా మూఢాల కారణంగా మూగబోయిన కల్యాణ వీణ మళ్లీ మోగుతోంది. ఎక్కడ చూసినా కల్యాణ కాంతులు ధగధగ లాడుతుండడంతో పాటు అటు కల్యాణ మండపాలు పెళ్లిళ్ల హడావిడితో కళకళ లాడుతున్నాయి. ఇటు ఊపందుకున్న పెళ్లిళ్ల సందడితో వ్యాపారాలు జోరందుకున్నాయి. కరోనా విపత్తు తరువాత మూడు నెలల క్రితం వరకు పెళ్లిళ్లు సందడిగానే జరగ్గా మళ్లీ మూఢం ముంచుకు రావడంతో పెళ్లిళ్లను చాలా మంది వాయిదా వేసుకున్నారు. మూఢం పోవడంతో పుణ్యక్షేత్రాల్లో వివాహ తంతును జరిపించుకోవాలని ఎదురు చూసిన పెళ్లి ఇంట ముహుర్తాలు కుదరడంతో అన్నవరం, వాడపల్లి, చిన్నితిరుపతి తదితర పుణ్యక్షేత్రాల్లో కళ్యాణ శోభ సంతరించుకుంది.


మూడు వారాల పాటు శుభ ముహూర్తాలు..


మూడు నెలలుగా ముహుర్తాలు లేక పెళ్లిళ్లు వాయిదా వేసుకున్నవారు తాజాగా మూడు వారాల పాటు ఏకధాటిగా శుభముహుర్తాలు ఉండడంతో వివాహ వేడుకును అంగరంగ వైభవంగా జరిపించుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. ఈనేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లో వేలాదిగా వధూవరులు ఒక్కటవ్వబోతున్నారు. డిసెంబరు ఒకటో తేదీ నుంచి 18వ తేదీ వరకు మొత్తం పన్నెండు రోజుల పాటు బలమైన ముహూర్తాలు ఉండడంతో పెళ్లిళ్లు జోరందుకున్నాయి. సాధరణంగా అశ్వీయుజ, కార్తీక, మార్గశిర మాసాల్లో వివాహాలు ఎక్కువగా జరుగుతాయి.. కానీ మూఢం కారణంగా బ్రేక్‌ పడింది.


కల్యాణ మండపాలు కళకళ..


మూడు నెలలుగా వెలవెలబోయిన కల్యాణ మండపాలన్నీ ప్రస్తుతం కళకళలాడుతున్నాయి. వస్త్ర దుకాణాలు, పూల దుకాణాలు, కిరాణా దుకాణాలన్నీ, బంగారం షాపులు, భాజాలు వాయిస్తూ బతికే వాళ్లు, అయ్యగార్లు.. ఇలా అందరూ ఈ వివాహల వల్ల ఉపాధి పొందుతారు. ఇన్నాళ్లూ పనులు లేక ఇబ్బందులు పడ్డ వాళ్లంతా వరుస శుభ ముహూర్తాలతో తెగ బిజీ అయిపోయారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా కల్యాణ మండపాలు కళకళలాడుతున్నాయి. ఇప్పటికే కల్యాణ మండపాలు, సత్రాలు, కన్వెన్షన్‌ హాళ్లు, చిన్నా చితకా పంక్షన్‌ హాళ్లు అన్నీ బుక్‌ అయిపోయాయి. చాలా మందికి కల్యాణ మండపాలు దొరక్క ఆలయాల్లోనే వివాహ తంతును కానిచ్చేసి ఇంటికి సమీప బహిరంగ ప్రాంతాల్లో రిసెప్షన్‌ వేడుకును ఘనంగా జరిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే విధంగా షామియానాలు, ఫ్లవర్‌ డెకరేషన్లు, బ్యాండు మేళాలు ఇలా అన్నీ ఇప్పటికే పురమాయించుకుంటున్నారు. దీంతో వీటికి డిమాండ్‌ బాగా పెరిగిపోయింది. చాలా చోట్ల సమకూర్చలేమని చేతులెత్తేసే పరిస్థితి కనిపిస్తోంది. 


జోరందకున్న వ్యాపారాలు..


పెళ్లి అంటే జీవితంలో చేసుకునే అతిపెద్ద పండుగ. దాన్ని ఎవరూ అంత త్వరగా మరిచిపోలేరు. దాన్ని ఎంతో ఘనంగా జరిపించుకునేందుకు చాలా మంది ఎంత ఖర్చుకైనా వెనకాడని పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలోనే పెద్ద పెద్ద వస్త్ర దుకాణాలు మొదలుకుని బంగారు షాపులు, ఇతర వ్యాపారాలు పెళ్లింట వారి తాకిడికి కళకళలాడుతున్నాయి. మరో పక్క క్యాటరింగ్‌ సంస్థలు క్షణం తీరకలేకుండా పళ్లింట భోజనాలు సమకూర్చేందుకు తలమునకలైన పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా ఈ మూడు వారాల సమయంలో ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో సుమారు 20 వేలకు పైబడి వివాహాలు జరుగుతాయని అంచనా ఉంది.