ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ చలాన్ల స్కాం ఎంత పెద్దదో అంచనా వేయడం ఉన్నతాధికారులకు కూడా సాధ్యం కావడం లేదు. పరిశీలన జరిపే కొద్దీ మోసాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటి వరకూ 770 డాక్యుమెంట్లు నకిలీ చలాన్లు పెట్టి రిజిస్ట్రేషన్ చేసినట్లుగా గుర్తించినట్లుగా రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ మీడియాకు వెల్లడించారు. అయితే ఈ స్కాం స్వరూప  స్వభావాలు ప్రభుత్వం చెబుతున్న దాని కంటే చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే  సస్పెండైన సబ్ రిజిస్ట్రార్ల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఇతర సిబ్బందిని కూడా సస్పెండ్ చేశారు పెద్ద ఎత్తున డాక్యుమెంట్ రైటర్ల ప్రమేయాన్ని గుర్తించారు.  ఇప్పటి వరకూ 65 లక్షల డాక్యుమెంట్లను పరిశీలించినట్లగా ప్రభుత్వం చెబుతోంది. అయితే ఈ స్కాంలో కేవలం రూ. ఐదు కోట్లు మాత్రమే గోల్ మాల్ జరిగిందని ప్రభుత్వం చెబితే ఇంత హడావుడి  పడాల్సిన పని లేదని ఎంత కాలం నుంచిజరుగుతుందో గుర్తిస్తే తప్ప అసలు గోల్‌మాల్‌ను అంచనా వేయడం కష్టమని నిపుణులు అంచనావేస్తున్నారు.  


సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపం కారణంగా ఉపయోగించిన చలానానే మళ్లీ మళ్లీ రిజిస్ట్రేషన్లకు ఉపయోగించినందున ప్రతీ డాక్యుమెంట్‌ను నిశితంగా పరిశీలిస్తేనే అసలు విషయం  బయటపడుతుందని అంచనా వేస్తున్నారు. ఈ స్కాంపై ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. అసలు మూలం కనిపెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కారణంగానే రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి సైతం రంగంలోకి దిగారు. కడప, కృష్ణా జిల్లాల్లో  సబ్ రిజిస్ట్రార్లు ఎక్కువ అక్రమాలకు పాల్పడినట్లుగా గుర్తించారు. అయితే ఇది మొత్తం ఇంటర్‌లింక్‌లతో నిండిన స్కాం అని భావిస్తున్నారు. ఎక్కడ నుంచైనా రిజిస్ట్రేషన్లు చేయించుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత స్కాం చేయడానికి మరింత స్కోప్ పెరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవహారంలో సమగ్రమైన విచారణ జరిగితే స్కాం మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేకంగా సిట్‌ను ఏర్పాటు చేయడం లేదా.. సీఐడీ విచారణకు ఆదేశించడం వంటి చర్యలు తీసుకుంటారని భావించారు. 


కానీ ప్రభుత్వం మాత్రం పోలీసు విచారణ సరిపోతుందని ఉంటున్నారు. రెవన్యూ పరంగా సోదాలు చేసి.. ఎక్కడెక్కడ దోపిడీ జరిగిందో గుర్తించి కేసులుపెడితే చాలని భావిస్తోంది. కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకే గండి కొట్టే అతిపెద్ద స్కాం కావడంతో ప్రభుత్వ చర్యలు మరింత సీరియస్‌గా ఉండాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. సాధారణంగా రిజిస్ట్రార్ కార్యాలయాలు అంటేనే అవినీతికి నిలయాలన్న అభిప్రాయంఉంది. ప్రజల వద్ద నుంచి పీడించడం.. నకిలీ రిజిస్ట్రేషన్లు లాంటి దందాలతోపాటు ఇప్పుడు నేరుగా ప్రభుత్వ ఖజానాకే్ చిల్లు పెట్టేలా సబ్ రిజిస్ట్రార్లు వ్యవహరించడం సంచలనం రేపుతోంది. ముందు ముందు ఈ కేసు విషయంలో బయటపడే వ్యవహారాలు మరింత కలకలం రేపడం ఖాయంగా భావిస్తున్నారు.