Anantapur News :అనంతపురం జిల్లా రాజకీయాలకు పెట్టింది పేరు. నిత్యం అధికార,  ప్రతిపక్ష పార్టీలు మాటలు నూరుతుంటాయి. కొన్నిసార్లు పరిస్థితి అదుపుతప్పి దాడులు కూడా జరుగుతుంటాయి. వీటిని ఆపాలంటే పోలీసుల పని కత్తిమీద సాము లాంటిది. అయితే ఇటీవల పోలీసులు ట్రెండ్ మార్చారు. ప్రతిపక్ష నేతలు నిరసన అంటే మరో ఆలోచన లేకుండా అదుపుచేస్తున్నారు. దీంతో ప్రతిపక్షాలు పోలీసులను టార్గెట్ చేస్తున్నాయి. అధికారపార్టీ చెప్పినట్లు పోలీసులు వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే అనంతపురం పోలీసులు ఒక అడుగు ముందుకేసి ప్రతిపక్షాలకు సవాల్ విసురుతున్నారు. మీసం తిప్పుతూ, కాల్చేస్తా అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. జేసీ బ్రదర్స్  ను ఢీకొట్టిన గోరంట్ల మాధవ్  సీఐగా ఉన్నప్పుడు మీసం తిప్పి సవాల్ చేశారు. ఆ తర్వాత పదవికి రాజీనామా చేసి వైసీపీ చేరిపోయారు. ఎన్నికల్లో గెలిచి హిందూపురం ఎంపీ అయిపోయారు. తాజాగా పోలీసులు ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారని ప్రచారం జరుగుతోంది. నిన్న కదిరి సీఐ ఓ  ల్యాండ్ వ్యవహారంలో మీసం తిప్పి టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. తాజాగా రామగిరి సీఐ, హిందూపురం పార్లమెంట్ టీడీపీ బి.కె పార్థసారధిపై ఫైర్ అయ్యారు. ఏకంగా అడుగు ముందుకేస్తే కాల్చేస్తా అని రెచ్చిపోయారు. 


రెచ్చిపోయిన రామగిరి సీఐ!  


రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి పంచాయతీ వైసీపీ నేత, వైస్ సర్పంచ్ రాజారెడ్డి, అతని మద్దతుదారులు 50 కుటుంబాలు వెంకటాపురంలో మాజీ మంత్రి పరిటాల సునీత  ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. వారిని కుంటిమద్ది చెరువు కట్టపై వాహనాన్ని రాప్తాడు ఎమ్మెల్యే సోదరుడు రాజశేఖర్ రెడ్డి ఆపి రాజారెడ్డిని దౌర్జన్యంగా తీసుకెళ్లారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఆ సమయంలో టీడీపీ మాజీ ఎంపీపీ అమరేంద్ర, దుర్గప్ప, ఇతర నాయకులపై దాడి చేశారు.  ఈ సంఘటనపై నిరసనను తెలియజేయడానికి పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ చెన్నై కొత్తపల్లి పోలీస్ స్టేషన్ వెళ్తున్నప్పుడు వారిని రామగిరి పోలీస్ స్టేషన్ దగ్గర పోలీసులు అడ్డుకున్నారు.  దీంతో పరిటాల శ్రీరామ్,  సునీత రోడ్డుమీద బైఠాయించి నిరసన తెలియజేశారు. ఈ నిరసన కార్యక్రమంలో హిందూపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బి.కె పార్థసారధి పాల్గొన్నారు. ఈ సమయంలో రామగిరి సీఐకు, పార్థసారధికి మధ్య వాగ్వాదం జరిగింది. ఒకరిపైకి ఒకరు దూసుకెళ్లారు. ఆగ్రహంతో ఊగిపోయిన సీఐ ఒక్క ముందుకు వేస్తే కాల్చేస్తా అంటూ బెదిరింపులకు దిగారు. అక్కడున్న టీడీపీ నేతలు సీఐపైకి దూసుకొచ్చారు. మిగతా పోలీసులు వారిని అదుపుచేసి పరిస్థితిని చక్కదిద్దారు. 


కదిరి అర్బన్ సీఐ సవాల్ 


కదిరిలో ఓ ప్రైవేటు స్థలంపై వివాదం వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణకు దారితీసింది. టీడీపీ వర్గీయులు అడ్డొస్తే ప్రొక్లైనర్ తో తొక్కించేయండని వైసీపీ నాయకులు అనడంతో వివాదం పెద్దదైంది.  శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో స్థల వివాదం నెలకొంది. ఎవరు అడ్డొచ్చినా తొక్కించేయండని పొక్లెయిన్ డ్రైవర్ కు వైసీపీ నాయకులు చెప్పడంతో  అతడు పొక్లెయిన్ వేగంగా ముందుకు తీయడంతో టీడీపీ వర్గీయులు దానికి అడ్డుగా నిలబడ్డారు. ఇరు రెండువర్గాలు పరస్పరం రాళ్ల దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణ విషయం తెలుసుకున్న కదిరి ఎస్ఐ, అర్బన్ సీఐలు తమ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు.  పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. పోలీసులు తమను మాత్రమే లక్ష్యంగా చేసుకొని లాఠీఛార్జ్ చేశారంటూ టీడీపీ నేతలు ఆరోపించారు. టీడీపీ వర్గీయులు ఆరోపణలతో సీఐ మధు ఆగ్రహంతో ఊగిపోయారు. రండి తేల్చుకుందామని మీసం తిప్పి సవాల్ చేశారు. దీనిపై సీఐ మధును వివరణ కోరగా ప్రొక్లైనర్ పై పెట్రోల్ పోసి కాల్చేస్తారనే సమాచారంతో ఇరువర్గాలను చెదరగొట్టేందుకు లాఠీఛార్జ్ చేశామన్నారు.  


గోరంట్ల మాధవ్ ఎపిసోడ్ 


గోరంట్ల మాధవ్ ... ప్రస్తుతం హిందూపురం ఎంపీ. అయితే రాజకీయాల్లోకి రాకముందు ఆయన సీఐగా బాధ్యతలు నిర్వహించారు. అనంత‌పురం జిల్లా పోలీసు అధికారుల సంఘానికి కార్యద‌ర్శిగా కూడా ప‌నిచేశారు. అప్పట్లో ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డిపై మీసం మెలేసి స‌వాల్ విసిరిన ఘ‌ట‌న‌తో ఒక్కసారిగా గోరంట్ల మాధవ్ వెలుగులోకి వ‌చ్చారు. స్వామి ప్రబోధానంద ఆశ్రమం వివాదంలో దివాక‌ర్ రెడ్డి జిల్లా పోలీసుల‌ను ఉద్దేశించి అప్పట్లో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై గోరంట్ల మాధ‌వ్ జేసీపై నిప్పులు చెరిగారు. పోలీసులు జేసీ దివాక‌ర్ రెడ్డి పాలేర్లు కాద‌న్నారు. స్వప్రయోజనాల కోసం పోలీసులను చులకన చేసి మాట్లాడితే నాలుక కోస్తానని హెచ్చరించారు. అనంత‌రం త‌న ఉద్యోగానికి రాజీనామా చేసిన గోరంట్ల మాధ‌వ్‌ వైసీపీలో జాయిన్ అయ్యారు. హిందూపురం లోక్‌స‌భ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. 


అనంతపురం సీఐలు 


రాజకీయాల్లో ప్రత్యర్థులకు సవాల్ విసురుతూ ఉంటారు. అయితే అనంతపురం జిల్లాలో సీఐలు రాజకీయనేతలకు మీసాలు తిప్పి సవాళ్లు విసురుతున్నారు. పోలీసులు ఏదో ఆశించి ఇలా ఫైర్ అవుతున్నారన్న ప్రచారం కూడా లేకపోలేదు. అధికారపార్టీ పెద్దల కన్నుల్లో పడేందుకు ఇలా చేస్తున్నారని కొందరు చేస్తుంటారని, అందుకే ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.