అమరావతిలోని క్వాంటం వ్యాలీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కలిసి 7 ఫిబ్రవరి 2026న శంకుస్థాపన చేశారు.
Quantum Valley in Amaravati : అమరావతిలో ఏర్పాటయ్యే క్వాంటం వ్యాలీ ఏపీ తలరాత మార్చేస్తుందా? యువతకు దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటీ
Quantum Valley in Amaravati : నేడు అమరావతిలో క్వాంటం వ్యాలీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్తో కలిసి శంకుస్థాపన చేయనున్నారు.

Quantum Valley in Amaravati : హైదరాబాద్ను హైటెక్ సిటీ పేరుతో ఐటీ హబ్గా మార్చినట్టుగానే, ఇప్పుడు అమరావతిని ప్రపంచ దేశాలు అబ్బురపడేలా క్వాంటం కంప్యూటింగ్ హబ్గా మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోంది. నేడు(7ఫిబ్రవరి 2026)ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ కలిసి అమరావతిలోని క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన చేయనున్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే మైలురాయిగా భావిస్తున్నారు. ఇది కేవలం టెక్ పార్క్ మాత్రమే కాదని రాబోయే తరాల భవిష్యత్ను మార్చే విజన్గా ప్రభుత్వం అభివర్ణిస్తోంది.
అసలు క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ?
మనం వాడుతున్న కంప్యూటర్లు, ఫోన్లు, బిట్స్ ఆధారంగా పని చేస్తాయి. అంటే చిన్నప్పుడు మీరు నేర్చుకున్న ద్విసంఖ్యామానం గుర్తుందా... అంటే ఎంత పెద్ద సంఖ్యలనైనా 0,1 రూపంలో రాయడం. వీటి ఆధారంగానే ఇప్పటి వరకు కంప్యూటర్, ల్యాప్టాప్, ఫోన్ పని చేస్తూ వచ్చాయి. ఇప్పుడు క్వాంటం కంప్యూటర్లో అలా కాదు. ఇక్కడ క్యూబిట్స్ ఆధారంగా పని చేస్తాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి ఒకే సమయంలో 0, 1 రెండూ అవ్వగలవు. దీన్నే సూపర్పొజిషన్ అంటారు. దీని వల్ల మామూలు కంప్యూటర్లు కొన్ని ఏళ్లు పని చేసే పనిని, క్వాంటం కంప్యూటర్లు కేవలం సెకన్లలో పూర్తి చేస్తాయి. ముఖ్యంగా మందుల తయారీ, వాతావరణ అంచనాలు, సైబర్ సెక్యూరిటీ వంటి రంగాల్లో ఇది విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది.
అమరావతిలో ఏం జరగబోతోంది?
క్వాంటం కంప్యూటర్ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలో చేతులు కలిపింది. అమరావతిలో సుమారు యాభై ఎకరాల్లో ఈ వ్యాలీని ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఐబీఎం క్వాంటం సిస్టమ్ 2 అనే భారీ కంప్యూటర్ను ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 156 క్యూబిక్ హెరా ప్రాసెసర్ను వాడుతున్నారు. ఇది మన దేశంలోని అతి పెద్ద క్వాంటం కంప్యూటర్ కానుంది.
ఈ వ్యాలీ కేవలం కంప్యూటర్లకే పరిమితం కాదు, ఇక్కడ హార్డ్వేర్ తయారీ, సాఫ్ట్వేర్ అభివృద్ధి, స్కిల్ ట్రైనింగ్ వంటివన్నీ ఒకే చోట ఉంటాయి. 2029 నాటికి దాదాపు ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
నిరుద్యోగులకు విద్యార్థులకు కలిగే ప్రయోజనం ఏంటీ?
ఈ ప్రాజెక్టు వల్ల ఆంధ్రప్రదేశ్లో భారీగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెబుతున్నారు. దాదాపు లక్ష హై స్కిల్ ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం కేవలం ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, యువతకు శిక్షణ కూడా ఇవ్వబోతోంది. వన్ ఎంటర్ప్రెన్యూర్ పర్ ఫ్యామిలీ అనే విజన్తో సుమారు పది లక్షల మంది యువతకు క్వాంటం స్కిల్స్లో శిక్షణ ఇవ్వాలని ప్లాన్ చేశారు.
ఇప్పటికే ఏపీఎస్ఎస్డీసీ సహకారంతో యాభై వేల మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. దీని వల్ల మన రాష్ట్ర యువత విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే భారీ జీతాలతో ఉద్యోగాలు సంపాదించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది. ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ వంటి సంస్థల భాగస్వామ్యంతో ఈ శిక్షణ కొనసాగుతోందని వెల్లడిస్తున్నారు.
ప్రజల జీవితాల్లో వచ్చే మార్పులేంటి?
2030 నాటికి దాదాపు ఐదు వేల కోట్ల విలువైన ఎగుమతులు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతి ఇండియాకే క్వాంటం క్యాపిటల్గా మారుతుందని చెబుతున్నారు. క్వాంటం కంప్యూటర్ల సహాయంతో క్యాన్సర్ వంటి వ్యాధులకు త్వరగా మందులు కనుగొనే అవకాశం ఉంది. వాతావరణాన్ని ముందే కచ్చితంగా అంచనా వేయడం ద్వారా రైతులకు పంటల విషయంలో ఎంతో లాభం కలుగుతుందని వివరిస్తున్నారు. ఆనలైన్ మోసాలు అరికట్టేందుకు కూడా సురక్షితమైన వ్యవస్థ తయారవుతుందని తెలుపుతున్నారు.
చంద్రబాబు విజన్; హైటెక్ నుంచి క్వాంటం వ్యాలీ
దీనిపై మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ నాడు హైదరాబాద్ను ఐటీ రంగంలో ఎలాగైతే ముందు నిలిపారో, నేడు అమరావతిని డీప్టెక్ రంగంలో గ్లోబల్లీడర్గా చేయాలని చంద్రబాబు కంకణం కట్టుకున్నారని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఎవర్నీ ఫాలో అవ్వని అందరికీ దారి చూపిస్తుందని ఇప్పుడు అదే బాటలో ఉందని టీడీపీకి చెందిన సీనియర్ నేత ఒకరు కామెంట్ చేశారు.
ఎదురయ్యే సవాళ్లు ఏంటీ?
క్వాంటం టెక్నాలజీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఈ కంప్యూటర్లు వేడెక్కకుండా ఉండటానికి భారీ స్థాయిలో కూలింగ్ సిస్టమ్ అవసరం. అయితే ప్రభుత్వం ఇప్పటికే వీటిన్నింటికీ ప్రణాళిక సిద్ధం చేసినట్టు చెబుతోంది. కేంద్రం చేపట్టిన నేషనల్ క్వాంటం మిషన్తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది.
Frequently Asked Questions
అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమైంది?
క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏమిటి?
క్వాంటం కంప్యూటర్లు బిట్స్ బదులుగా క్యూబిట్స్ ఉపయోగిస్తాయి. ఇవి ఒకే సమయంలో 0, 1 రెండూ కాగలవు, దీనివల్ల సంక్లిష్ట పనులను సెకన్లలో చేయగలవు.
అమరావతి క్వాంటం వ్యాలీలో ఏయే కంపెనీలు భాగస్వామ్యం వహిస్తున్నాయి?
క్వాంటం కంప్యూటర్ ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ వంటి ప్రపంచ స్థాయి కంపెనీలతో కలిసి పనిచేస్తోంది.
క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్ వల్ల నిరుద్యోగులకు, విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి?
ఈ ప్రాజెక్ట్ ద్వారా లక్ష హై-స్కిల్ ఉద్యోగాలు వస్తాయి. యువతకు క్వాంటం స్కిల్స్ లో శిక్షణ ఇచ్చి, భారీ జీతాలతో ఉద్యోగాలు సంపాదించుకునేలా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
క్వాంటం కంప్యూటింగ్ వల్ల ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి?
క్వాంటం కంప్యూటర్ల సహాయంతో క్యాన్సర్ వంటి వ్యాధులకు త్వరగా మందులు కనుగొనవచ్చు, వాతావరణాన్ని కచ్చితంగా అంచనా వేయవచ్చు, ఆన్లైన్ మోసాలను అరికట్టవచ్చు.























