Amaravati Land Pooling: త్వరలో అమరావతిలో మూడో విడత భూ సమీకరణ - ఏపీ మంత్రి నారాయణ
Land acquisition in Amaravati | ఏపీ రాజధాని అమరావతి సమగ్ర అభివృద్ధి కోసం మూడో విడత భూ సేకరణపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి నారాయణ తెలిపారు.

AP Capital Amaravati | అమరావతి: ఏపీ ప్రభుత్వం రాజధాని అమరావతి సమగ్ర అభివృద్ధిపై ఫోకస్ చేసింది. ఇదివరకే రెండో విడతలో రైతుల నుంచి 16 వేలకు ఎకరాలకు పైగా భూముల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ మరుసటి రోజే రాజధాని కోసం మూడో విడత ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ)పై రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రాజధాని కోసం మూడో విడత భూ సేకరణ ఉంటుందని ఏపీ మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ తెలిపారు. రెండో విడతలో భాగంగా ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ ఏర్పాటు పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మూడో విడత భూ సమీకరణ అంశంపై త్వరలో క్లారిటీ ఇస్తామన్నారు. మూడో విడత భూ సేకరణకు సంబంధించిన తుది నిర్ణయం త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. తొలి విడతలో రైతుల నుంచి 34 వేల ఎకరాలు సేకరించగా, ప్రభుత్వ భూములు దాదాపు 16 వేల ఎకరాలు సీఆర్డీఏకు అప్పగించింది.
రాజధానిలో బ్యూటిఫికేషన్పై ఫోకస్
అమరావతి రాజధాని నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల వివరాలను మున్సిపల్ శాఖా మంత్రి నారాయణ వెల్లడించారు. రాజధాని అమరావతి సిటీ మొత్తం 227 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉందని, ఇందులో 30 శాతం ప్రాంతం గ్రీన్ అండ్ బ్లూ ఏరియాగా ఉండేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో భాగంగా ఏర్పాటు చేసిన రోడ్ల వెంట బ్యూటిఫికేషన్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఆయా సీజన్లలో లభించే పూల రకాలను ఉపయోగించి బ్యూటిఫికేషన్ పనులు చేపడతామని వివరించారు. అదే విధంగా, 22 రోడ్లలో ఇరువైపులా ఉన్న బఫర్ జోన్లలో గ్రీనరీని అభివృద్ధి చేసే పనులు జరుగుతున్నాయి.

శాఖమూరు పార్క్, బయో డైవర్సిటీ పార్కులు..
190 ఎకరాల్లో శాఖమూరు పార్క్ సిద్ధమవుతోందని, అలాగే 200 ఎకరాల్లో బయో డైవర్సిటీ పార్కును ఏర్పాటు చేసే పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. దీంతో పాటు, కృష్ణాయపాలెం మరియు నీరుకొండ వద్ద ఉన్న రిజర్వాయర్ల బ్యూటిఫికేషన్ పనులు కూడా జరుగుతున్నట్లు మంత్రి నారాయణ వెల్లడించారు.
‘శాఖమూరు పార్కులో అమ్యూజ్మెంట్ పార్కుకు సంబంధించిన ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా, పిల్లల కోసం స్నో వరల్డ్, అడ్వెంచర్ పార్క్ వంటి విభాగాలు అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా, ఈ పార్కులో 50 ఎకరాల్లో రిజర్వాయర్ను ఏర్పాటు చేస్తున్నారు. మరో ముఖ్య ఆకర్షణగా, 20 ఎకరాల విస్తీర్ణంలో దశావతార ఫ్లవర్ గార్డెన్ను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ మొత్తం కోర్ క్యాపిటల్ ప్రాంతంలో, సుమారు 30 శాతం ఏరియాలో బ్యూటిఫికేషన్, గార్డెనింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని’ పేర్కొన్నారు.






















