Nandamuri Lakshmi Parvati comments on Chandrababu Naidu: అబద్దాలతో అడ్డదారిలో చంద్రబాబు అధికారంలోకి రావాలని చూస్తున్నారని  నందమూరి లక్ష్మీపార్వతి విమర్శలు చేశారు. ఎన్టీఆర్ వంటి మహానుభావుడు టీడీపీని స్థాపించారని.. ఎంతో ప్రతిష్టాత్మకంగా నెలకొల్పిన పార్టీ నేడు చంద్రబాబు చేతిలో దిగజారిపోతోందని ఆవేదన చెందారు. తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను చంద్రబాబు దిగజర్చారని ఆరోపించారు. ఎన్టీఆర్ నే గద్దేదించిన చంద్రబాబు ఈ రోజు ఆయన ఫోటోను వాడుకుంటున్నారని అన్నారు. నిజంగా మీరు ఎన్టీఆర్ అభిమానులు అయితే చంద్రబాబును తరిమికొట్టండని ప్రజలకు పిలుపు ఇచ్చారు. తెలుగు సాంస్కృతిక అకాడమీ అధ్యక్షురాలు, వైఎస్ఆర్ సీపీ నేత నందమూరి లక్ష్మీపార్వతి శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. 


క్విట్ ఇండియా మాదిరి చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని అన్నారు. పురంధేశ్వరి గురించి మాట్లాడుతూ.. ఆమె బీజేపీకన్నా టీడీపీ కోసమే ఎక్కువ పని చేస్తుందని అన్నారు. ఎలక్షన్స్ వచ్చే సరికి రకరకాల వేషాలు వేసేవాళ్లు వస్తారని.. రకరకాల విన్యాసాలు చేస్తారని అన్నారు. చంద్రబాబు ఆడించినట్లు కొంతమంది ఆడుతున్నారని.. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టే ఘనత చంద్రబాబుకే సొంతం అని అన్నారు. అధికార దాహం కోసం ఎటువంటి కుతంత్రాలకైనా చంద్రబాబు పాల్పడతాడని అన్నారు.


చంద్రబాబు తప్పుడు సర్వేలు చూపిస్తున్నాడని.. చంద్రబాబు అందరికీ వంగి వంగి దండాలు పెడుతున్నాడని అన్నారు. కేసుల నుంచి తప్పించుకోవటానికి చంద్రబాబు బీజేపీతో జతకట్టే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. షర్మిల దారితప్పిన బాణం అంటూ ఎద్దేవా చేశారు.