సత్తెనపల్లి యువగళం పాదయాత్రలో లోకేష్ తనపై చేసిన కామెంట్స్ కు మంత్రి అంబటి రాంబాబు దీటుగా కౌంటర్ ఇచ్చారు. రాత్రి పూట తాను గోకినోళ్ళు లోకేష్ కు వచ్చి ఏం చెప్పారని మంత్రి అంబటి ప్రశ్నించారు.


రాజకీయాల్లో నారా లోకేష్ బఫూన్‌ - అంబటి


సత్తెనపల్లి నియోజకవర్గంలో లోకేశ్‌ పాదయాత్ర ఒక రోజులో ముగించేశాడని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అయితే పాదయాత్రలో లోకేష్ తన పై చేసిన విమర్శలకు అంబటి కౌంటర్ ఇచ్చారు.  నారా లోకేశ్‌ తన స్థాయికి మించి మాట్లాడి   వికృతమైన ఆనందాన్ని పొందే ప్రయత్నం చేశాడని అంబటి అన్నారు. తాను  ఎప్పటి నుండో  రాజకీయాల్లో ఉన్నానని, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని చెప్పారు. అయితే నారా లోకేశ్‌ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉండగానే, ఒక మంత్రిగా ఉండగానే ఓడిపోయాడని ఎద్దేవా చేశారు. సినిమాల్లో కమెడియన్స్, సర్కస్‌లో బఫూన్లు ఉన్నట్లే రాజకీయాల్లోనూ బఫూన్లు ఉంటారని, లోకేష్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తెలుగు జాతి గర్వపడాలని ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపిస్తే లోకేశ్‌, ఆ తెలుగును ఖూనీ చేస్తున్నాడని మండిపడ్డారు. 


డెంగ్యూ పేరును పలకలేని లోకేష్


డెంగ్యూ పేరును సైతం లోకేష్ సరిగ్గా పలకలేకపోయారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ప్రశాంత అనే పదాన్ని కూడా ప్రశాంతి అత్తను చేశాడని వ్యాఖ్యానించారు.  బీసీ వర్గాలతో నిర్వహించిన సమావేశంలో బీసీ సోదరులకు బదులు బీసీ చౌదరులు అంటూ లోకేష్ మాట్లాడటం ఏంటని ప్రశ్నించారు. వైశ్యులను వైశాలి అని, మాట్లాడం కూడా సబబు కాదన్నారు. తెలుగు పదాలను సరిగ్గా మాట్లాడలేని లోకేష్ తనను విమర్శిస్తున్నాడని, దిగజారి విమర్శలు చేయటం మానుకోవాలని అన్నారు.


నీ బతుకేంటో చూసుకో లోకేశ్‌


తనను ఉద్దేశించి లోకేష్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి అంబటి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. పగలు వాగి, రాత్రి గోకుతానంటూ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అర్దరహితమని పేర్కొన్నారు. తాను గోకిన వ్యక్తులు లోకేష్ కు ఏమైయినా చెప్పారా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గురించి కూడా తాను విమర్శలు చేస్తానని అయితే అవన్నీ లోకేష్ కు వాగుడుగా అనిపిస్తున్నాయని అన్నారు. తన నియోజకవర్గంలో ప్రజలతో కలసి సాంప్రదాయంగా సంక్రాంతి పండుగ నాడు డాన్స్ చేశానని అయితే లోకేష్ తరహాలో క్లాబ్ డాన్స్ లు, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించలేని కౌంటర్ ఇచ్చారు.  రాజకీయంగా సరైన విమర్శలు చేయలేని పరిస్థితుల్లో లోకేష్ ఉన్నాడని అంబటి వ్యాఖ్యానించారు.


కన్నాపై అంబటి ఫైర్


మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. జగన్ తన తండ్రికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నాడని కన్నా మాట్లాడటాన్ని తప్పుబట్టారు. జగన్‌ తండ్రి పేరును మరింత ముందుకు తీసుకెళ్తున్న కుమారుడని  కితాబిచ్చారు. రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రుల కుమారులు కూడా రాజకీయాల్లో ఉన్నారని, అయితే జగన్‌ లా పట్టుదలతో రాజకీయాలు చేసి చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి అయిన వారెరవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు.