Bharat Ratna for NTR: 'ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని తీర్మానిద్దాం- మోడీని కలుద్దాం' అసెంబ్లీలో జనసేన ఎమ్మెల్యే డిమాండ్!
Bharat Ratna for NTR: ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. దీనిపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని జనసేన ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

Bharat Ratna for NTR: ఎన్టీఆర్కు భారత రత్న అవార్డు ఇప్పుడు కాకుంటే ఇంకా ఎప్పుడు సాధించుకోలేమని జనసేన పార్టీ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రస్తావించారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో సమర్థవంతమైన నాయకులు ఉన్నారని అందుకే ఈ టైంలోనే భారత రత్న విషయంలో ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి ఏకగ్రీవంగా అమోదించుకొని కేంద్రానికి పంపించాలని సలహా ఇచ్చారు. అవసరం అయితే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఇంకా సీనియర్ నేతలతో కలిసి వెళ్లీ ప్రధానమంత్రి మోదీని కలిసి ఎన్టీఆర్కు భారత రత్న ఇవాల్సిన అవసరాన్ని చెబుదామని అన్నారు.
బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో కొణతాల ఈ భారత రత్న ప్రస్తావన తీసుకొచ్చారు. రాష్ట్రంలో ట్రిపుల్ ఇంజిన్ సర్కారు నడుస్తోందని చెప్పుకొచ్చిన ఆయన, గత లోపాలను పూర్తిగా తొలగించి చంద్రబాబు, పవన్ కల్యాణ్, మోదీ ఏపీ రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నారు అని అన్నారు. గవర్నర్కు ధన్యవాదాలు చెప్పిన ఆయన ప్రత్యేక అనుమతితో ఎన్టీఆర్ అంశాన్నీ ప్రస్తావించారు.
ఆయన ఏమన్నారంటే " టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ గురించి స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉంది. సామాన్యుడి గురించి, రైతు గురించి, కార్మికుడి గురించి ఆలోచించిన వ్యక్తి. వీళ్ల కోసం నాడు ఉన్న కాంగ్రెస్ పార్టీతో పోరాడి పార్టీ పెట్టి 18 నెలల్లోనే పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన ఘనత ఆయన సొంతం. నటసౌర్వభౌముడుగా కూడా పేరు తెచ్చుకున్న ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడు ఆయనకు సముచిత గౌరవం ఇచ్చిన వాళ్లం అవుతాం. ఇవాల్సిన అవసరం కూడా ఉంది. ప్రత్యేక తీర్మానం ఏర్పాటు చేయాలి. ఇలాంటి మంచి అవకాశంలో ఇప్పుడే భారతరత్న సాధించుకోగలుగుతాం. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ అందరూ ప్రధానమంత్రిని కలిసి దీనిపై చర్చించాలి. సాధించుకోవాల్సిన అవసరం ఉంది."























