చంద్రబాబుపై నమోదైన స్కిల్ డెవలప్ మెంట్ కేసు, ఏసీబీ కోర్టు విధించిన రిమాండ్ను కొట్టివేయాలని దాఖలైన క్వాష్ పిటిషన్ పై విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. దీనిపై పూర్తి వాదనలు వినాల్సి ఉందని ఏపీ హైకోర్టు ధర్మాసనం వెల్లడించింది. కాబట్టి, అప్పటి వరకూ చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇవ్వొద్దని ఏసీబీ కోర్టును ఆదేశించింది. క్వాష్ పిటిషన్పై కౌంటర్ దాఖలుకు సీఐడీ సమయం కోరగా.. హైకోర్టు అందుకు అంగీకరించింది.
మరోవైపు సీఐడీ వేసిన కస్టడీ పిటిషన్పై ఈనెల 18 వరకు విచారణ చేపట్టవద్దని ఏసీబీ కోర్టును హైకోర్టు ఆదేశించింది. అటు రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను కూడా ఈ నెల 19కి హైకోర్టు వాయిదా వేసింది.