Bill Gates Amaravati Visit: ఏపీ సచివాలయంలో బిల్ గేట్స్, సీఎం చంద్రబాబుతో కీలక భేటీ
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఏపీ రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి వచ్చారు. ఆయనకు సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలికారు.

అమరావతి: ప్రముఖ దాత, గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ బిల్ గేట్స్ ఏపీ పర్యటనకు వచ్చారు. ఆయన రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయంలో సందడి నెలకొంది. సచివాలయం మొదటి బ్లాక్ వద్దకు చేరుకున్న బిల్ గేట్స్ బృందానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఇతర మంత్రులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గ సహచరులను బిల్ గేట్స్కు వ్యక్తిగతంగా పరిచయం చేశారు. స్వాగత కార్యక్రమం అనంతరం, వారు సచివాలయంలోని మీటింగ్ హాలుకు చేరుకున్నారు. అక్కడ ఏపీ ప్రభుత్వ ప్రాధాన్యతలు, టెక్నాలజీ ఆధారిత పాలన, గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంపై చర్చలు జరగనున్నాయి.

ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ లతో సమావేశం కానున్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులను మరింత విస్తరించే అంశంపై చర్చిస్తారు.

రాష్ట్ర సచివాలయానికి వచ్చిన బిల్ గేట్స్, ఆర్టీజీఎస్ కేంద్రానికి వెళ్లి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించనున్నారు. రియల్ టైమ్ గవర్నెన్సు విధానాలు, ఫలితాలను బిల్ గేట్స్ కు వివరించనున్న సీఎం చంద్రబాబు. అనంతరం గేట్స్ బృందంతో సమావేశం కానున్న సీఎం, మంత్రులు, వివిధ శాఖల అధికారులు.

స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష్యాలు, ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య తదితర రంగాల్లో చేపట్టిన సంస్కరణలపై ప్రజంటేషన్ ఇవ్వనున్నారు చంద్రబాబు. మెడ్ టెక్, డయాగ్నస్టిక్స్ సేవలు, సంజీవని తదితర ప్రాజెక్టుల గురించి వివరించనున్న సీఎం చంద్రబాబు.

గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టు గురించి రాష్ట్ర ప్రభుత్వం వివరించనుంది. అనంతరం బిల్ గేట్స్ టీం అమరావతిలో ఉండవల్లి గ్రామం వద్ద ఓ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనుంది. వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టే సాగు విధానాన్ని బిల్ గేట్స్ పరిశీలించనున్నారు. తన పర్యటనలో భాగంగా బిల్ గేట్స్ ఏపీలో మరిన్ని పెట్టుబడులపై ఏమైనా ప్రకటన చేస్తారా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
























