simhachalam chandanotsavam 2025 | అమరావతి: విశాఖ జిల్లాలోని సింహాచలంలో నిజరూప దర్శనానికి పోటెత్తిన భక్తులు ప్రమాదవశాత్తూ చనిపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సింహాచలంలో జరిగిన ప్రమాద ఘటనపై ఉన్నతాధికారులు, మంత్రులతో సిఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. గోడ కూలిన ఘటనపై ముగ్గురు సభ్యుల కమిటీతో విచారణకు సిఎం చంద్రబాబు ఆదేశించారు.

బాధిత కుటుంబాలను ఆదుకున్న ఏపీ ప్రభుత్వం

చనిపోయిన ఏడుగురు భక్తుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలో గాయపడిన వారికి రూ.3 లక్షల పరిహారం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులకు దేవాదాయ శాఖలో పరిధిలోని ఆలయాల్లో అవుట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగ అవకాశం ఇవ్వాలని మంత్రులకు సూచించారు.

ఇలాంటివి జరగకుండా చూడాలన్న చంద్రబాబుసీఎం చంద్రబాబు బుధవారం ఉదయం నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డోలా బాల వీరాంజనేయ స్వామి, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, ఎంపి భరత్, సింహాచల దేవాలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లా అధికారులతో మాట్లాడి ఘటన జరిగిన తీరు, క్షతగాత్రులకు అందుతున్న వైద్య సాయం వివరాలు తెలుసుకున్నారు. ఇలాంటివి జరగకుండా ఇకనుంచి పటిష్ట చర్యలు తీసుకోవాలని మంత్రులు, అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.

చందనోత్సవం సందర్భంగా పోటెత్తిన భక్తులు

నిజరూప దర్శనం కోసం భక్తులు సింహాచలం వరాహ లక్ష్మీనారసింహ స్వామి ఆలయానికి మంగళవారం రాత్రి నుంచే పోటెత్తుతున్నారు. వైశాఖమాసంలో పౌర్ణమి ముందు వచ్చే తదియ రోజు స్వామివారికి చందనోత్సహం ఘనంగా నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా నారసింహ స్వామి దేవాలయాలు చాలా ఉన్నాయి. కానీ వరాహం, నరసింహ అవతారాలు ఉన్న విగ్రహం ఉన్న కారణంగా సింహాచలం ఆలయానికి విశిష్టత ఉంది. అందుకే స్వామివారి నిజరూప దర్శనం కోసం చందనోత్సవం సమయంలో భక్తులు సింహాద్రి అప్పన్న దర్శనం కోసం తండోపతండాలుగా సింహాచలం వస్తుంటారని తెలిసిందే.