ఇప్పటికే రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ పై భారీగా ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమావేశం కీలకంగా మారనుంది. ఈ సమావేశంలో జగన్ ఏం చెబుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది.
సొమవారం జగన్ కీలక సమావేశం...
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు, పార్టీ నేత‌ల‌తో సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం నిర్వ‌హించబోతున్నారు. సోమవారం ఈ సమావేశం జరగనుంది. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత జ‌రుగుతున్న స‌మావేశం కావ‌డంతో పార్టీ నేత‌ల్లో చ‌ర్చ‌గా మారింది. జ‌గ‌న‌న్నే మా భ‌విష్యత్తు క్యాంపెయిన్ పై కేడర్ కు దిశా నిర్ధేశం చేయ‌నున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఎమ్మెల్యేల ప‌ని తీరు, గ‌డ‌ప గ‌డ‌ప‌కూ కార్య‌క్ర‌మంపై స‌మీక్షించ‌నున్నారు సీఎం జగన్.. మంత్రి  వర్గ మార్పులు చేర్పులపైనా చర్చ జరిగే  అవకాశం కూడా ఉందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
క్యాంపు కార్యాలయం కేంద్రంగా...
పార్టీ నేత‌లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌తో సీఎం జ‌గ‌న్ కీల‌క స‌మావేశం నిర్వ‌హించున్నారు. సోమవారం మ‌ధ్యాహ్నం మూడు గంట‌ల‌కు క్యాంప్ కార్యాల‌యంలో ఈ సమావేశం జ‌ర‌గ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 13న ఎమ్మెల్యేల‌తో ముఖ్యమంత్రి జగన్ ఇదివరకే భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత పార్టీలో కీల‌క నిర్ణయాలు జ‌రిగాయి. అయితే సోమవారం జ‌రిగే స‌మావేశం ద్వారా నేత‌ల ప‌ని తీరుపై ఒక నిర్ఱయానికి వచ్చే అవకాశం ఉందని గ‌తంలోనే సీఎం జగన్ చెప్పారు. దీంతో ఈసారి స‌మావేశంలో ఎవ‌రి భ‌విష్య‌త్ ఏంట‌నే దాని పై సీఎం ఓ క్లారిటీ ఇచ్చేస్తారంటున్నాయి పార్టీ వర్గాలు. గ‌డ‌ప గ‌డ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మంతో పాటు స‌చివాల‌య క‌న్వీన‌ర్లు, గృహ‌సార‌థుల ప‌ని తీరు పైనా ఈ సమావేశంలో చ‌ర్చించే అవ‌కాశం ఉందంటున్నారు పార్టీ నేత‌లు. 
ఏప్రిల్ సెకెండ్ వీక్ లో స్టిక్కర్ లు పంపిణీపై...
మార్చి నెల 18 నుంచి 26 వ‌ర‌కూ జ‌గ‌న‌న్నే మా భ‌విష్య‌త్తు క్యాంపెయిన్ నిర్వ‌హించాల‌ని ప్రతయ్నించారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నిక‌లతో  ఆ కార్య‌క్ర‌మం వాయిదా ప‌డింది. దీంతో ఏప్రిల్ రెండో వారం  నుంచి ఈ కార్య‌క్ర‌మం ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వ‌హించాల‌నే దానిపై కేడ‌ర్ కు సీఎం జగన్ దిశా నిర్దేశం చేయ‌నున్నారు. జ‌గ‌న‌న్నే మా భ‌విష్య‌త్తు క్యాంపెయిన్ ద్వారా గ‌త ప్ర‌భుత్వాల క‌న్నా వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్ర‌భుత్వం అందించిన పాల‌న‌, అభివృద్ది, సంక్షేమాన్ని ప్ర‌తి ఇంటికీ వివ‌రించేలా ప్ర‌భుత్వం ముందుకు వెళ్ళాలని భావిస్తోంది. ఇప్ప‌టికే సుమారు 8 వేల స‌చివాల‌యాల్లో గ‌డ‌ప గడ‌ప‌కూ మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హించింది ప్ర‌భుత్వం. ఇక మిగిలిన స‌చివాల‌యాల్లో కూడా త్వ‌రిత‌గ‌తిన కార్య‌క్ర‌మం పూర్తిచేయాల‌ని సీఎం జ‌గ‌న్ సూచించ‌నున్నారు.
ఎమ్మెల్సీ ఫలితాలపై జగన్ సీరియస్....
ఇటీవ‌ల జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల ఫ‌లితాల్లో అనుకోని ప‌రిస్థితి ఎదుర‌వ‌డంతో ఈసారి స‌మావేశం హాట్ హాట్ గా చర్చ జ‌రిగే అవ‌కాశం క‌నిపిస్తుంది. ఇప్ప‌టికే ప‌ని తీరు మార్చుకోని మంత్రులను కొంతమందిని మార్చేస్తాన‌ని ప‌లుమార్లు హెచ్చ‌రించారు సీఎం జ‌గ‌న్. నివేదిక‌ల ఆధారంగా ఎలాంటి కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తారోన‌ని వైసీపీ నేత‌లు, ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు టెన్ష‌న్ ప‌డుతున్నారు. మొత్తానికి సోమవారం జరిగే స‌మావేశంలో కీల‌క ప్ర‌క‌ట‌న‌లు ఉంటాయంటున్నారు పార్టీ నేత‌లు...
మీరంతా మాట్లాడండి...
ఈ సారి జరిగే సమావేశంలో మరో ప్రత్యేకత ఉండే అవకాశం లేకపోలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సమావేశానికి హజరయిన నాయకులు, ఎమ్మెల్యేలు ఎవరయినా మాట్లాడేందుకు వీలు కల్పించే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటివరకు జరిగే సమావేశాల్లో జగన్ కీలక ప్రసంగం మాత్రమే ఉంటుంది. ఆ తరువాత ఎవరయినా నేతలు జగన్ ను కలసి మాట్లాడటం సరిపోతోంది. అయితే ఈ సమావేశంలోనే అందరి ముందు జగన్ వేదికపై ఉండగానే నేతలను మాట్లాడించే ఉద్దేశం కూడ ఉందిన పార్టి వర్గాల్లో ప్రచారం జరుగుతుంది.