అమరావతి: జూన్ 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన రోజు అని, ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అధికారం పేరుతో ఊరేగిన ఉన్మాదాన్ని ప్రజలు తరిమికొట్టిన రోజు, సైకో పాలనకు అంతం పలికి..... రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ స్వేచ్ఛ, ప్రశాంతత పొందిన రోజు. ఉద్యమంలా ఓట్లేసి తిరిగి రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన రోజు కనుక ఇది ప్రజాతీర్పు దినం ( #PrajaTeerpuDinam ) అని ఏడాది పాలనపై చంద్రబాబు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

గత ప్రభుత్వ ఉగ్రవాదంతో గాయపడ్డ రాష్ట్రాన్ని కూటమి చేతిలో పెట్టి సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలికిన రోజు నేడు. తెలుగుదేశం సైనికుల పోరాటాలు, జనసైనికుల ఉద్యమాలు, బీజేపీ శ్రేణుల మద్దతుతో రాష్ట్రం గెలిచిన రోజుగా ఎన్నికల్లో విజయం సాధించిన రోజును చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి నేటితో ఏడాది పూర్తి అవుతోంది. 175 స్థానాలకుగానూ ఏకంగా 164 స్థానాల్లో కూటమి నేతలు విజయం సాధించి ప్రభంజనం సృష్టించిన రోజుగా చంద్రబాబు పేర్కొన్నారు. 

‘ఏడాది కిందట ప్రజలు మాకు ఇచ్చిన అధికారాన్ని ఏపీ పునర్నిర్మాణ బాధ్యతగా భావించి పనిచేస్తున్నాం. రాష్ట్ర ప్రజలు మాపై పెట్టుకున్న ఆశలు, ఆకాంక్షల నెరవేర్చేందుకు, వారి నమ్మకాన్ని నిజం చేసేందుకు పాలనను గాడిన పెడుతున్నాం. సంక్షేమాన్ని అందిస్తూనే, మరోవైపు అభివృద్ధి పట్టాలెక్కించాం. ఏపీ దశ దిశను మార్చేందుకు ఇచ్చిన ఏకపక్ష తీర్పునకు ఏడాది పూర్తయిన సందర్భంగా నాటి విజయాన్ని గుర్తుచేసుకుంటూ రాష్ట్ర ప్రజలకు శిరసు వంచి నమస్కారాలు’ అని చంద్రబాబు పోస్ట్ చేశారు. వచ్చే నాలుగు ఏళ్లలో మరెన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు. గతంలో జరిగిన విధ్వంస పాలకులపై రాజీలేని పోరాటంతో కూటమి విజయానికి నాంది పలికిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల కార్యకర్తలకు, నేతలకు చంద్రబాబు అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు తెలుపుతూ జై ఆంధ్రప్రదేశ్.. జై జై ఆంధ్రప్రదేశ్! అని తన పోస్టులో రాసుకొచ్చారు.