AP CM Chandrababu: రెండేళ్లలో ఏపీ నుంచి ప్రపంచ దేశాలకు క్వాంటం కంప్యూటర్లు: సీఎం చంద్రబాబు
Amaravati Quantum Valley | అమరావతిలోని క్వాంటం వ్యాలీ నుంచి రెండేళ్లలో క్వాంటం కంప్యూటర్లు తయారుచేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.

అమరావతి: సంక్షేమ పథకాలు అవసరమా అనే చర్చ అనవసరమని, అట్టడుగు వర్గాల పేదలను ఆదుకోవడానికి ఇవి తప్పనిసరని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యం కేవలం పథకాలు అందించడమే కాకుండా, వాటిని క్షేత్రస్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడమేనని అధికారులకు సూచించారు. మరో 2 ఏళ్లలో అమరావతిలో క్వాంటం కంప్యూటర్లు తయారై ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతి అవుతాయన్నారు. రాష్ట్ర సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎం చంద్రబాబు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి సంబంధించి జీఎస్డీపీ (GSDP) వృద్ధిరేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, పది సూత్రాల అమలుపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా రియల్ టైమ్ గవర్నెన్స్లో భాగంగా ఏఐ (AI) టూల్స్ వినియోగం, డేటా భద్రత, యువతకు నైపుణ్యాభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే 'వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్ప్రెన్యూర్' విధానాన్ని సమర్థంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు.
ఏపీ నుంచి ప్రపంచ దేశాలకు క్వాంటం కంప్యూటర్లు
రాబోయే రోజుల్లో సాంకేతిక రంగంలో రానున్న మార్పులను ప్రస్తావిస్తూ, అమరావతి కేంద్రంగా క్వాంటం కంప్యూటింగ్ విప్లవం రాబోతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు. రానున్న రెండేళ్లలో ఇక్కడి నుంచే క్వాంటం కంప్యూటర్లు తయారై ప్రపంచానికి సరఫరా అవుతాయని పేర్కొన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, డేటా సెంటర్ల ద్వారా రాష్ట్ర ముఖచిత్రం మారబోతోందని, ఈ క్రమంలో కలెక్టర్లు, ఇన్-ఛార్జ్ మంత్రులు సమన్వయంతో పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. పాలనలో ఏఐ (AI) అప్లికేషన్ల వినియోగాన్ని పెంచుతూ, క్షేత్రస్థాయిలో కలెక్టర్లు మరియు ఇన్-ఛార్జ్ మంత్రులు పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు. రైతు ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.
ఏపీలో గత 19 నెలల పాలనపై సీఎం చంద్రబాబు సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రం ఎదుర్కొన్న అంధకారం నుంచి బయటపడి, ప్రస్తుతం వ్యవస్థలన్నీ తిరిగి గాడిన పడ్డాయని ధీమా వ్యక్తం చేశారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోందని, ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వ ప్రగతిపై నిర్దేశించుకున్న లక్ష్యాల దిశగా పయనిస్తున్నామని స్పష్టం చేశారు.
సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'సూపర్ సిక్స్' పథకాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయని సీఎం పేర్కొన్నారు. ఈ పథకాల ద్వారా లబ్ధిదారులకు చేకూరిన ప్రయోజనాలను ఆయన వివరించారు: తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాల్లో రూ. 10,000 కోట్లు జమ చేమచేశామన్నారు. స్త్రీశక్తి ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా మహిళల మొబిలిటీ పెరిగిందని, ఇప్పటివరకు 4.29 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగాయని తెలిపారు.
అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతన్నలకు రూ. 6,310 కోట్ల ఆర్థిక సాయం అందించడమే కాకుండా, రాయలసీమను హార్టికల్చర్ హబ్గా, కోస్తాను ఆక్వా హబ్గా తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. పెన్షన్ల రూపంలో రూ. 58,000 కోట్లు, దీపం 2.0 పథకం కింద 2 కోట్ల గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసినట్లు వివరించారు.
























