Free Sand Policy: ఉచిత ఇసుకపై వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. అమరావతిలో విద్యుత్‌పై వైట్‌పేపర్ రిలీజ్  చేసిన సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ... ఉచిత ఇసుక విధానాన్ని కూడా తప్పుపట్టే పరిస్థితికి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటింటికీ వెళ్లి ఉచిత ఇసుక ఇవ్వలేమని అన్నారు. 


ఇసుక కొనాల్సిన అవసరం లేకుండా చేశామన్న చంద్రబాబు.... రవాణా ఖర్చులు, కూలీల ఖర్చు, జీఎస్టీ ఎవరైనా ఇచ్చుకోవాల్సిందేనన్నారు. ఇవన్నీ చెల్లించినా గత ప్రభుత్వం హయాంలో ఉన్న రేట్లు కంటే సగం కంటే తక్కువకే ఇసుక వస్తుందని వివరించారు. ఇలా ప్రజలకు మంచి జరుగుతుందన్న ఆలోచన లేకుండా ఈ విధానంపై కూడా విమర్శలు చేస్తుంటే వారిని ఏమి అనాలో అర్థం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


ఉచిత ఇసుక విధానంతో మార్కెట్లో రేటు భారీగా పడిపోయిందని గుర్తు చేశారు చంద్రబాబు. ఇన్నాళ్లు ఇసుకను భారీ ధర ఇచ్చి కొన్న ప్రజలు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని... నిర్మాణ పనులు ఊపందుకోనున్నాయని చెప్పుకొచ్చారు. పదిమందికి ఉపాధి కూడా లభిస్తుందని అభిప్రాయపడ్డారు. దీన్ని భరించలేని వాళ్లంతా విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ వస్తున్నామని అడ్డగోల విధానాలతో అన్ని వ్యవస్థలను గాడిలో పెడుతున్నామని వివరించారు. అందులో భాగంగానే ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చామని గుర్తు చేశారు. 


ఇసుక కావాల్సిన వాళ్లు రవాణా ఖర్చులు, కూలీ డబ్బులు, జీఎస్టీ చెల్లించి ఎక్కడి నుంచైనా పట్టుకెళ్లొచ్చన్నారు చంద్రబాబు. ఈ మూడింటికీ మినహాయింపు ఇవ్వలేమని అన్నారు. వైసీపీ నేతలు చెప్పినట్టు ఉచిత ఇసుక అంటే ఇంటింటికీ వెళ్లి ఇవ్వడం సాధ్యమా అని ప్రశ్నించారు. వైసీపీ నేతలు కూడా తమ అవసరాల కోసం ఎద్దుల బండిని తీసుకెళ్లి ఇసుకు తెచ్చుకోవచ్చని సలహా ఇచ్చారు. 


తానే ఇంటింటికీ వెళ్లి ఇసుక ఇవ్వాలనేలా వైసీపీ వాదనలు ఉన్నాయని ఎగతాళి చేశారు. అన్నీ తెలిసి కూడా కొందరు వింతగా మాట్లాడుతున్నారని అలాంటి వారిని ఏమి అనాలో తనకు అర్థం కావడం లేదని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇసుక కొరత అనే మాట లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు చంద్రబాబు


విద్యుత్ శ్వేత పత్రంలో ఏమన్నారంటే?


"ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలని పిలుపుతో ప్రజలు మమ్మల్ని గొప్ప స్థానంలో నిలబెట్టారు. అందుకే బాధ్యతాయుతమైన పాలన అందించేందుకు ప్రజలందరికీ వాస్తవాలు చెబుతున్నాం. విద్యుత్‌తో ప్రతి ఒక్కరి జీవితం ముడిపడి ఉంది జీవన ప్రమాణాలు ఆధారపడి ఉన్నాయి. 2014నాటికి విద్యుత్ కొరత ఉంది. ఈ ఐదేళ్లలో ఆ రంగాన్ని పూర్తిగా నాశనం చేశారు. అసమర్థులు పాలన చేస్తే ఏమవుతుందో ఇది ఉదాహరణ. ఐదేళ్లలో వైసీపీ రూ.32,166 కోట్ల విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై వేసింది. విద్యుత్ రంగంలో రూ.49,596 కోట్లు అప్పులు చేశారు. మొత్తంగా రూ.1,29,503 కోట్లు నష్టం మిగిల్చారు. పవన్ విద్యుత్‌లో చేసుకున్న 21 ఒప్పందాలు రద్దు చేశారు. 


1998లో తొలిసారి విద్యుత్ సంస్కరణలు అమలు చేశాం. దేశంలోనే మొట్టమొదట రెగ్యులేటరీ కమిషన్ ఏపీలోనే వచ్చింది. విద్యుత్ సంస్కరణలతో అధికారం పోయినా దేశం బాగుపడింది. నాటి సంస్కరణల ఫలితాలు వైఎస్ హయాంలో కనిపించాయి. 2014-19లో కూడా సౌరశక్తి, పవన విద్యుత్ ఉత్పత్తి పెంచాం. విద్యుత్ సంస్థలకు 145 అవార్డులు వచ్చాయి. 2014-19లో తలసరి వినియోగం 1,234 యూనిట్లకు పెరిగింది. 2018 నాటికి మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఎదిగాం. 2018-19 నాటికి 14,929 మెగావాట్ల ఉత్పత్తికి రాష్ట్రాన్ని చేర్చాం. 


స్మార్ట్ మీటర్లపై త్వరలోనే నిర్ణయం 
వ్యవసాయ పంప్ సెట్లకు స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు చంద్రబాబు. ఒప్పందాల ప్రకారమే పనిచేయాలని గుర్తు చేశారు. "థర్మల్ విద్యుత్‌ను గ్రీన్ హైడ్రోజన్‌గా మార్చేందుకు ముందుకొస్తున్నారు. విద్యుత్ రంగం బలోపేతానికి సాంకేతిక సాయం తీసుకుంటాం. భవిష్యత్తులో ఈవీ వాహనాలు మరింత పెరుగుతాయి. ఆ మేరకు విద్యుత్ ఉత్పత్తి పెంచుకోవాలి. టారిఫ్ నియంత్రణపై దృష్టి సారిస్తాం. కరెంటు కోతలు ఉండకూడదు. నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి. గ్రీన్ హైడ్రోజన్ వస్తే మనకు అదనంగా పన్నులు వస్తాయి. రూఫ్ టాప్ సౌరశక్తి ఉత్పత్తి పెంచేందుకు చర్యలు తీసుకుంటాం. తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలపై కమిటీ నిర్ణయిస్తుంది. కేంద్ర విద్యుత్ పథకాలు పీఎం సూర్య ఘర్, కుసుమ్ వినియోగించుకుంటామన్నారు సీఎం చంద్రబాబు