Amaravati High Alert: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. రాజధాని నగర పరిధిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తూ గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ కీలక ప్రకటన విడుదల చేశారు. రాజధాని ప్రాంతంలో ఇటీవల జరుగుతున్న కొన్ని అవాంఛనీయ ఘటనలు, అమరావతి నిర్మాణం తిరిగి ఊపందుకుంటున్న వేళ విద్రోహక శక్తులు తలదూర్చకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ హై అలర్ట్ ప్రకటించినట్టు తెలుస్తోంది. 

Continues below advertisement

ఈ భద్రతా వ్యూహంలో భాగంగా తక్షణమే అమలులోకి వచ్చేలా ఆరు ప్రధాన ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. కేవలం పగటిపూట మాత్రమే కాకుండా రాత్రి సమయంలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిరంతరం నిఘా ఏర్పాటు చేయడం ఈ కొత్త ప్రోటోకాల్‌ ప్రధాన ఉద్దేశం. 

రాజధాని లోపలికి వచ్చే, బయటకు వెళ్లే ప్రతి వాహనాన్ని తనిఖీ చేసేందుకు 6 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. దీని వల్ల అనుమానితుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించే అవకాశం ఉంటుంది. ఆధునిక సాంకేతికతను జోడించి, రాత్రి సమయాల్లో క్షేత్రస్థాయిలో పోలీసులు వెళ్లలేని ప్రాంతాలను సైతం గమనించేందుకు డ్రోన్లను వినియోగిస్తున్నారు. ఈ డ్రోన్ కెమెరాలు నిరంతరం ఆకాశం నుంచి నిఘా వేసి, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే కంట్రోల్ రూమ్‌ను అప్రమత్తం చేస్తాయి. పోలీసు వాహనాలు నిరంతరం రాజధాని రహదారులపై గస్తీ తిరుగుతూ ఉంటాయి. ఇది నేరస్తుల్లో భయం కలిగించడమే కాకుండా, స్థానికుల్లో, నిర్మాణ పనుల్లో ఉన్న కార్మికుల్లో భద్రతా భావాన్ని కల్పిస్తుంది. 

Continues below advertisement

నిర్మాణ సంస్థలకు కఠిన ఆదేశాలు 

అమరావతిలో ప్రస్తుతం అనేక నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆయా నిర్మాణ సంస్థలకు ఎస్పీ వకుల్ జిందాల్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాజధాని ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత కేవలం పోలీసులదే కాదని, సంబంధిత సంస్థలు కూడా సహకరించాలని పోలీసులు పేర్కొన్నారు. 

ప్రతి నిర్మాణ ప్రాంగణంలో హైడెఫినిషన్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. నిర్మాణ సంస్థలు తమ సొంత సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకొని, పగలు, రాత్రి వేళల్లో గస్తీ కాయాలి. నిర్మాణ సమయంలో అగ్నిప్రమాదాలు జరగకుండా ఫైర్ సేఫ్టీ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ హెచ్చరించారు.