Independence Day 2026 At Amaravati: భారతదేశం 80వ స్వాతంత్య్ర సంబరాలు ఘనంగా చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌ చరిత్రలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర విభజన తర్వాత అనేక సవాళ్లను ఎదుర్కొన్న ఏపీ, తన రాజధాని అమరావతి వేదికగా తొలిసారిగా అధికారికంగా స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించుకుంది. రాజధాని ప్రాంతమైన రాయపూడిలోని పరేడ్‌  గ్రౌండ్స్‌లో ఉదయం మువ్వన్నెల జెండా ఎగిరింది. 

Continues below advertisement

ఉదయం 9.27 నిమిషాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేడుక ప్రాంగణానికి చేరుకున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా వచ్చిన సీఎం కాన్వాయ్‌కు బుల్లెట్‌ ఎస్కార్టు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పరేడ్ మైదానానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు. 

అనంతరం సీఎం చంద్రబాబు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, వందన సమర్పణ చేశారు. ఈ సందర్భంగా  ఏపీపీఎస్సీ సహా వివిధ పోలీసు దళాలు, ఎన్సీసీ క్యాడెట్లు, సీఆర్పీఎఫ్‌ దళాలు నిర్వహించిన మార్చ్‌ పాస్ట్‌ వీక్షకులను మంత్రముగ్ధులను చేసింది. పోలీసు దళాల నుంచి సీఎం గౌరవ వందనాన్ని స్వీకరించారు. 

Continues below advertisement

ఈ ఏడాది వేడుకలను స్వర్ణాంధ్ర-2047 అనే థీమ్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 2047 నాటికి అంటే భారత్‌ 100వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకునే నాటికి ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలనే సమ్మున్నత లక్ష్యంతో ఈ థీమ్‌ ఎంచుకున్నారు. 

ముఖ్యమంత్రి ప్రసంగంలోని కీలక అంశాలు 

జాతీయ జెండా మన స్వాతంత్య్రానికి, ఆత్మగౌరవానికి ప్రతిబింబమని ఆయన అభివర్ణించారు. జెండా ఐక్యతకు చిహ్నం, భవిష్యత్‌కు మార్గదర్శకం అని పేర్కొన్నారు. 

మన చేతిలో జాతీయ జెండా ఉండాలి, మన గుండెల్లో దేశం కోసం బలమైన అజెండా ఉండాలి అంటూ సీఎం పిలుపునిచ్చారు

స్వాతంత్య్రం అనేది ఒక్క రోజులోనో, ఒక్కరి పోరాటంతోనో వచ్చిందని కాదని, ఎందరో అమరుల బలిదానం దీని వెనుక ఉందని గుర్తు చేశారు. ముఖ్యంగా తెలుగు నేల గర్వించ దగ్గ అల్లూరి సీతారామరాజు, జాతీయ జెండా రూప శిల్పి పింగళి వెంకయ్య వంటి వారిని స్మరించుకున్నారు. 

విశాఖపట్నం, అమరావతి, తిరుపతి ప్రాంతాలను ప్రత్యేక ఎకనామిక్‌ రీజియన్లుగా అభివృద్ధి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ప్రతి జిల్లా, ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ విధానమని ఆయన వివరించారు. 

2019-24 వరకు రాష్ట్రం విధ్వంసంపాలైందని ఆరోపించారు. అరాచక పాలన వల్ల అభివృద్ధి కుంటుపడిందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. 2024ఎన్నికల్లో ప్రజలు కూటమిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, ఇప్పుడు రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రానికి కొత్త ఊపిరి వచ్చిందని, పది సూత్రాల అజెండాతో ముందుకు సాగుతున్నామని ఆయన వివరించారు. 

దేశం మనకు ఏం చేసిందనే దాని కంటే, దేశానికి మనం ఏం చేయగలమని ఆలోచించాలని యువతకు సూచించారు. రానున్న 20 ఏళ్లు కష్టపడి పని చేస్తేనే స్వర్ణాంధ్ర, వికసిత్‌ భారత్‌ లక్ష్యాలు సాకారమవుతాయని స్పష్టం చేశారు. సమృద్ధి స్పష్టం చేశారు. సమృద్ధి, వైభవం వైపు అడుగులు వేయడానికి ప్రతి పౌరుడు తన బాధ్యతను గుర్తించాలని పిలుపునిచ్చారు.