Potti Sriramulu Statue: నేడే 58 అడుగుల పొట్టి శ్రీరాముల విగ్రహం ఆవిష్కరణ.. అమరావతిలో అమరజీవి స్మారకం
అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని అమరావతిలో తుళ్లూరు సమీపంలోని శాఖమూరు పార్కు వద్ద ఏర్పాటు చేసిన 58 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించనున్నారు.

Potti Sriramulu Statue | ఏపీ రాజధాని అమరావతి లో తెలుగు జాతి ఆంధ్ర రాష్ట్ర సాధకుడు అమరజీవి పొట్టి శ్రీరాములు భారీ విగ్రహావిష్కరణ ఈరోజు జరుగబోతోంది. ఏపీ సీయం చంద్రబాబు ఉదయం 11:15 గంటలకు అమరావతిలో తుళ్లూరు సమీపంలో శాఖమూరు పార్కు వద్ద ఏర్పాటు చేసిన 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలి అంటూ శ్రీ రాములు చేసిన త్యాగానికి స్పూర్తిగా ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
మార్చ్ 16 పుట్టినరోజు, పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని 6.80 ఎకరాల స్థలంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసింది పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్. వారి అభ్యర్ధన మేరకు భూమి ని మాత్రం ఏపీ ప్రభుత్వం కేటాయించగా బడ్జెట్ ను మాత్రం విరాళాల ద్వారా ట్రస్ట్ సేకరించింది.కేవలం 6 నెలల్లోనే రికార్డు స్థాయిలో పనులు చేపట్టి 58 అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసామని నిర్వాహకులు చెబుతున్నారు. ముందుగా ఫస్ట్ ఫేజ్ లో 58 అడుగుల విగ్రహాన్ని నెలకొల్పారు.

విగ్రహం ఒక్కటే 25 కోట్లు.. మొత్తం బడ్జెట్ 150 కోట్లు
పొట్టి శ్రీ రాములు విగ్రహం కోసం 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్ను ఉపయోగించారు. మొత్తం మూడు అంతస్తుల్లో ఉండే బేస్ మీద విగ్రహాన్ని నిలబెట్టారు. ప్రస్తుతం ఈ విగ్రహానికే ఆవిష్కరణ జరుగబోతోంది. ఇప్పటి వరకూ 25 కోట్లు ఖర్చు అయ్యాయని ట్రస్ట్ చెబుతోంది.రెండో దశలో ఇక్కడ మ్యూజియం, ఫోటో గ్యాలరీ, ఆడిటోరియం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను నిర్మించనున్నారు. ఇవన్నీ విగ్రహం క్రింద ఉన్న బేస్ లో ఉండే మూడు అంతస్తుల్లో వస్తాయి. ప్రభుత్వం ఇచ్చిన 6.8 ఎకరాల్లో విగ్రహం ఉన్న భాగం పోగా మిగిలిన ఖాళీ స్థలాన్ని స్మృతి వనం గా డెవలప్ చేయబోతున్నారు. వీటికి మరో 125కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేస్తున్నారు.
విగ్రహం ఎత్తు 58 అడుగులే ఎందుకంటే...?
తెలుగువారికి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు పోరాడిన శ్రీరాములు త్యాగాన్ని చాటిచెప్పేలా 58 అడుగుల శ్రీరాములు విగ్రహం తో ఈ స్మృతివనాన్ని తీర్చిదిద్దాలని అనుకుని అడుగు ముందుకు వేసినట్టు నిర్వాహకులు ఆర్య వైశ్య చైర్మన్ డుండి రాకేష్ తెలిపారు.
ఆంధ్రులకు సొంత రాష్ట్రం కోసం 58 రోజులు దీక్ష చేసి ఆత్మార్పణ చేసిన పొట్టి శ్రీరాములు
సరిగ్గా 125 ఏళ్ల క్రితం 1901 మార్చ్ 16 న జన్మించిన పొట్టి శ్రీరాములు మాదరాశీ లుగా పిలువబడుతున్న ఆంధ్రులకు ఒక రాష్ట్రం ఉండాలని మద్రాస్ లోని ప్రముఖ స్వాతంత్ర్య వీరుడు బులుసు సాంబమూర్తి ఇంట్లో 58 రోజులపాటు నిరాహార దీక్ష చేసి 1952 డిసెంబర్ 15 న మరణించారు. దానితో భగ్గుమన్న ఆంధ్రులను శాంతింప జేయడానికి నెహ్రూ ప్రభుత్వం 1953 అక్టోబర్ 1 న ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అమరజీవిగా ఆంధ్రులు పిలుచుకునే శ్రీ రాములు గౌరవార్ధం నెల్లూరు జిల్లాను 2008లో శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా గా మార్చారు. అలాగే ఆయన పేరుతో కేంద్రం ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను కూడా విడుదల చేసింది.
రాజమండ్రి లో పొట్టి శ్రీ రాములు తెలుగు విశ్వ విద్యాలయం ను ఏర్పాటు చేస్తూ 2025లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈరోజు ఏపీ రాజధాని అమరావతి లో అయన ప్రతిరూపం గా 58 అడుగుల భారీ కాంశ్య విగ్రహాన్ని నిలబెడుతున్నారు.
ట్రెండింగ్ వార్తలు



















