Ambati Rambabu on AP Skill Development:
ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో చంద్రబాబును అరెస్టు చేసింది రాష్ట్ర సీఐడీ అన్నది ఎంత నిజమో.. ఆ అరెస్టును, రిమాండ్ ను క్వాష్ చేయటానికి సీఐడీ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు.. ఈ మూడు కూడా తిరస్కరించటంతో టీడీపీ అధినేత రిమాండ్ లో ఖైదీగా ఉన్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు. 2014 నుంచి 2019 వరకు మోగించిన అవినీతి మోత కారణంగానే, చంద్రబాబుకు ఇంట్లో ఈగల మోత- జైల్లో దోమల మోత అన్నట్టుగా పరిస్థితి తయారైందని ఎద్దేవా చేశారు. అలాంటిది టీడీపీ వారు సెప్టెంబర్ 30న రాత్రి మోత మిగిస్తారట.. కంచాలు ఎవరి మీద మోగిస్తున్నారు. విజిళ్ళు ఎవరి మీద ఊదుతారు..? హారన్లు ఎవరిని ఉద్దేశించి కొడతారని అంబటి ప్రశ్నించారు.


విధి విచిత్రమైనదని.. కాపు ఉద్యమంలో పళ్ళాలు కొట్టినవారిని మక్కెలిరగొట్టి బొక్కలో వేసావ్ ! ఇప్పుడు అవినీతి కేసులో బొక్కలో పడి పళ్ళాలు కొట్టమంటున్నావ్ ! వారే వాహ్ ! అంటూ అంబటి రాంబాబు కౌంటర్లు వేశారు. స్కిల్ స్కాములో బాబు చేసిన పని, నిరుద్యోగుల కంచంలో పెట్టాల్సిన అన్నాన్ని తాను తినేయటం అని.. ఇలా అడ్డంగా తినేసినందుకు గుర్తుగా.. రేపు కంచాలు బయటకు తీసుకొచ్చి మోగిస్తారా..? అని ఎద్దేవా చేశారు. జన్మభూమి కమిటీలు మొదలు రాజధాని కుంభకోణాలు వరకు, ప్రతి ఒక్క విషయంలో 5 ఏళ్ళు అడ్డంగా తినేసిన బకాసురులంతా కలసి మోత మోగిస్తారని చెప్పారు. ఏ మొహం పెట్టుకుని చట్టబద్ధ అరెస్టును అపహాస్యం చేస్తారు. ఇదంతా వారు న్యాయ వ్యవస్థలు మేనేజ్ చేయలేనందుకు ఏడుస్తున్న ఏడుపే అన్నారు. రాజ్యాంగం మీద, చట్టం మీద నమ్మకం లేని యాంటీ సోషల్ ఎలిమెంట్లు అని అనాలా అని నిలదీశారు.


జగన్ నాలుగేళ్ళ పాలనలోనే పేద కులాలకి, పేద వర్గాలకి డీబీటీ ద్వారా బటన్ నొక్కి, వారి బ్యాంకు అకౌంట్ కు రూ. 2.35 లక్షల కోట్లు అందించారు. అదే స్థాయిలో బడ్జెట్, నిధులు ఉన్నా,  ఆ సొమ్మంతా టీడీపీ హయాంలో ఐదేళ్ళపాటు పేదలకు అందించకుండా ఉఫ్ అని ఊదేసినందుకు గుర్తుగా టీడీపీ వారంతా వచ్చి విజిళ్ళు ఊదుతారా..? అన్నారు. అవినీతి చేసి హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చి, బస్సులో పడుకున్నానని ఆడిన డ్రామాలకు గుర్తుగా హారన్లు మోగిస్తారా అని టీడీపీ శ్రేణుల్ని అడిగారు.


ఈడీ ఆఫీసు ఎదురుగా లోకేష్ కంచాలు కొట్టాలి!
చంద్రబాబు అవినీతిని, ఇదే స్కిల్ స్కాములో కేంద్ర ప్రభుత్వ ఎన్ ఫోర్స్ మెంటు డైరెక్టరేట్ కూడా నిర్థారించి నలుగుర్ని అరెస్టు చేసింది. కాబట్టి, రెండు వారాలుగా ఢిల్లీలో దాక్కున్న లోకేష్- ఆ ఈడీ ఆఫీసు ఎదురుగ్గా నిలబడి, ఇది అక్రమం అని కంచాలు కొడితే బాగుంటుందన్నారు. రాష్ట్రపతి, ప్రధాని మోదీ అమిత్ షా కార్యాలయాల ముందు నిలబడి, తమ ఎంపీలు, పురంధేశ్వరి, సీపీఐ నారాయణ, రామకృష్ణ, రేవంత్ రెడ్డి, సుజనా చౌదరి, సీఎం రమేష్, సత్యకుమార్, రేణుకా చౌదరి, కూనంనేని సాంబశివరావు, బీవీ రాఘవులు, జయ ప్రకాష్ నారాయణ.. వీళ్ళందర్నీ ఢిల్లీలో నిలబెట్టుకుని ఈడీ అరెస్టు అక్రమమని, స్కిల్ స్కామే లేదని ఢిల్లీలో కంచాలు కొడితే బాగుంటుందని సలహా ఇచ్చారు. విజిల్స్ ఊదితే ఇంకా బాగుంటుంది. హారన్లు కొడితే మరింత బాగుంటుంది అంటూ టీడీపీ చేపట్టనున్న మోత మోగిద్దాం పై తనదైన శైలిలో మంత్రి అంబటి చురకలంటించారు.


భారత ప్రభుత్వ ఐటీ శాఖ రూ. 119 కోట్ల చంద్రబాబు అవినీతిని నిర్థారించి, ఇప్పటికే మూడేళ్ళుగా దర్యాప్తు జరిపి, అనేక ఉత్తర ప్రత్యుత్తరాలు తర్వాత ఇదంతా అవినీతి సొమ్మే అని షోకాజ్ నోటీసు ఇచ్చిందన్నారు. కనుక కేంద్ర ఆర్థిక మంత్రి ఇంటి ముందు, ప్రధానమంత్రి ఇంటి ముందు, ఢిల్లీలోని ఐటీ శాఖ ప్రధాన కార్యాలయం ముందు పైన పేర్కొన్న జాబితాలోని వారంతా కంచాలు, గిన్నెలు, తపాలాలు, గరెటలు, గ్లాసులు అన్నీ తీసుకువెళ్ళి కొడితే బాగుంటుందని ఎద్దేవా చేవారు. వీలుంటే నల్ల చొక్కాల ప్రదర్శన చేసి, వాట్ ఐ యామ్ సేయింగ్.. అంటూ గతంలో కొట్టిన డైలాగుల్ని రిపీట్ చేస్తే బాగుంటుందన్నారు మంత్రి అంబటి.