ప్రస్తుత వేసవిలో ఊహించని విధంగా విద్యుత్‌ వినియోగం పెరుగుతుందని ముందే గ్రహించి అందుకు అనుగుణంగా ఇంధనశాఖ అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారని మంత్రి పెద్ది రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. 


వేసవిలో విద్యుత్ డిమాండ్ పై మంత్రి సమీక్ష 


వేసవిలో పెరుగుతున్న విద్యుత్‌ డిమాండును అధిగమించేందుకు తీసుకుంటున్న చర్యలు, విశాఖలో జరిగిన ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సులో కుదిరిన అవగాహన ఒప్పందాలకు అనుగుణంగా పరిశ్రమలు ఏర్పాటుపై అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్షించారు. వ్యయసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం జగన్‌ ఆశయాలకు అనుగుణంగా పెండింగ్ లో ఉన్న 1.25 లక్షల దరఖాస్తుదారులకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇప్పటికే ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఇక నుంచి దరఖాస్తు చేసిన వెంటనే  విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చే సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ ఎన్నడూలేని విధంగా  ఏప్రిల్‌లో 246.3 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్ నమోదైందని మంత్రి వివరించారు.


33 కేవీ సబ్‌ స్టేషన్లకు  కమిటీలు


అన్ని అంశాలు పరిష్కరించేందుకు రాష్ట్రంలోని ప్రతి 33 కేవీ సబ్‌ స్టేషన్‌కు ఎంపీపీ, జెడ్పీటీసీ, ముగ్గురు రైతులతో కూడిన  కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. గతంలో తాను తొలిసారిగా ఎమ్మెల్యే అయినప్పుడు ఈ తరహా కమిటీలు ఉండేవని, ఇప్పుడు మళ్లీ వాటిని నియమిస్తున్నామని చెప్పారు. దీనివల్ల విద్యుత్ సరఫరా, లోఓల్టేజీ వంటి సమస్యలను స్థానికంగానే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించుకునేందుకు వీలువుతుందని అన్నారు. 



ప్రాజెక్టులకు  పక్కా టైమ్‌లైన్‌...


విశాఖపట్నంలో జరిగిన  సమ్మిట్‌ లో కుదిరిన అవగాహన ఒప్పందాల  ప్రకారం రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేయించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. విశాఖపట్నంలో జరిగిన ఇన్వెస్ట్‌మెంట్‌ సమ్మిట్‌లో ఇంధన రంగంలో రూ. 9 లక్షల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ సంస్థలు ఎంఓయూలు కుదుర్చుకున్న విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. టైమ్‌లైన్‌ ప్రకారం పరిశ్రమలను గ్రౌండ్‌ చేయించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమీక్ష నిర్వహించామని మంత్రి తెలిపారు. 



జులై 15 లోగా శంకుస్థాపన....


16,500 మెగావాట్ల విద్యుదుత్పాదన సామర్థ్యంతో రూ.82,500 కోట్ల పెట్టుబడుతులకు సంబంధించిన 10 ప్రాజెక్టులకు జులై 15 లోగా శంకుస్థాపనలు చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నామని  మంత్రి ప్రకటించారు. ఎంఓయూల ప్రకారం పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఎదురయ్యే సమస్యలను పరిష్కరిస్తూ ముందుకెళ్లేందుకు  జిల్లా స్థాయి అధికారులతో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  ప్రతి వారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షిస్తారని తెలిపారు. తాను రాష్ట్ర స్థాయిలో ప్రతి నెలా సమీక్షించి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు.  


పక్కా సమాచారంతో స్పెషల్ పోర్టల్‌ 


పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సమగ్ర సమాచారంతో కాంప్రెహెన్సివ్‌  ప్రాజెక్టు మోనిటరింగ్‌ పోర్టల్‌ను ప్రారంభించాలని న్రెడ్‌క్యాప్‌ అధికారులను మంత్రి ఆదేశించారు. ఏ సమస్య ఉంటే ఏ అధికారిని సంప్రదించాలో కూడా అందులో ఫోన్‌ నంబరుతో సహా ఇవ్వాలని సూచించారు. పెట్టుబడులు పెట్టేవారికి సింగల్‌ విండో అనుమతులు, సదుపాయాల కోసం డిస్కమ్, ట్రాన్స్‌కో, న్రెడ్‌క్యాప్‌ అధికారులతో సంయుక్త కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.