AP liquor scam: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కాం నిందితులు సిఐడీని అసుల లెక్క చేయడం లేదు.  స్కాంలో కీలక నిందితులుగా చెబుతున్న ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటి వరకూ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కాలేదు.   చాలా మమందిని విచారణకు పిలుస్తూ నోటీసులు జారీ చేస్తున్నారు. కానీ పోలీసుల నోటీసుల్ని  అందుకని వాటిని గౌరవించిన వారు ఒక్కరూ లేరు. తమకు ముందుగా నిర్ణయించిన పనులు ఉన్నాయని తాము .. మీరు చెప్పిన తేదీల్లో రాలేమని  నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు.                  

వస్తానని చెప్పి డుమ్మా కొట్టిన విజయసాయిరెడ్డి                  

విజయసాయిరెడ్డికి సీఐడీ సాక్షిగా నోటీసులు జారీ చేసింది. ఆయన పద్దెనిమిదో తేదీన హాజరు కావాల్సి ఉంది. అయితే తాను పదిహేడునే వస్తానని సీఐడీ అధికారులకు సమాచారం ఇచ్చారు.  హఠాత్తుగా గురువారం ఉదయం అనివార్య కారణాలతో తాను రావడం లేదని సమాచారం ఇచ్చారు. సీఐడీ అధికారులు ఈ సమాచారాన్ని సీరియస్ గా తీసుకుంటారో లేదో కానీ.. ఆయన కోసం శుక్రవారం ఎదురు చూసే అవకాశాలు ఉన్నాయి. 

లాయర్ తో ఆన్సర్లు పంపిస్తానన్న మిథున్ రెడ్డి            

లిక్కర్ స్కాంలో మరో నిందితుడిగా ఉన్న మిథున్ రెడ్డికి కూడా సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. శనివారం విచారణకు రావాలని మిథున్ రెడ్డికి సీఐడీ సిట్ నోటీసులు పంపింది.  ఆయనకు రిలీఫ్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరిస్తే సుప్రీంకోర్టుకెళ్లారు. అక్కడ ముందస్తు బెయిల్ లభించింది.  విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ మిథున్ రెడ్డి మాత్రం శనివారం తనకు చాలా పనులు ఉన్నాయని.. ఆ పనుల్లో సీఐడీ విచారణ లేదని అంంటున్నారు. 

చిక్కడు - దొరకడు రాజ్ కసిరెడ్డి           

రాజ్ కసిరెడ్డి కోసం సీఐడీ సిట్ అధికారులు హైదరాబాద్‌లో వెదుకుతు  న్నారు. ఆయన ఇళ్లు, కార్యాలయాలతో సహా బంధువుల ఇళ్లలోనూ సోదాలు చేశారు. అయితే ఆయన దొరకలేదు. ఆయనకు నాలుగోసారి నోటీసులు జారీచేశారు.  హైకోర్టులో అరెస్టు నుంచి రక్షణ లభించనప్పటి నుండి  రాజ్ కసిరెడ్డి పరారీలో ఉన్నారు.  రాజ్ కసిరెడ్డికి ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఆయన దేశం దాటిపోయే అవకాశాలు దాదాపుగా ఉండవు. అంతకు ముందే ఆయన విదేశాలకు వెళ్తే ఏమీ చేయలేరు..కానీ ఆయన ఎక్కడున్నారో కూడా ఎవరికీ తెలియదు.

పోలీసులు కావాలనే పట్టుకోవడం లేదా ?                     

లిక్కర్ స్కాం చాలా సీరియస్ ఇష్యూ అని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే దర్యాప్తు సంస్థల్లో మాత్రం అంత దూకుడు కనిపించడం లేదు. నోటీసులు జారీ చేస్తున్నారు కానీ.. ఒక్కరంటే ఒక్కరూ హాజరు కాకపోవడం.. దర్యాప్తు సంస్థలు కూడా అతం సీరియస్ గా తీసుకోకపోవడం చర్చనీయాంశమవుతోంది.