Lingamaneni House CID :  అమరావతిలో చంద్రబాబు నివాసం ఉంటున్న లింగమనేని నివాసాన్ని జప్తు చేసే అంశంపై ఏసీపీ కోర్టు అనుమతి విచారణ తదుపరి విచారణను ఈ నెల పదహారో తేదీకి వాయిదా వేసింది. కోర్టు అటాచ్‌మెంట్‌కు అనుమతి ఇవ్వాలంటే..  తమ వాదనలు వినాలన్న ప్రతివాదుల పిటిషన్ ను డిస్మిస్ చేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. అయితే అటాచ్ మెంట్‌కు అనుమతి ఇస్తూ ఈ దశలో నిర్ణయం తీసుకోలేమని ఏసీబీ కోర్టు జడ్జి స్పష్టం చేశారు.  అఫిడవిట్ దాఖలు చేసిన సీఐడీ అధికారి విచారణకు రావాలని  జడ్జి ఆదేశించారు.  కేసుకి సంబంధించిన అన్ని వివరాలను తమ ముందు ఉంచాలని ఆదేశించారు. తదుపరి విచారణ పదహారో తేదీన జరగనుంది. 


లింగమనేని గెస్ట్ హౌస్ లోనే  చంద్రబాబునాయుడు నివాసం ఉంటున్నారు. నెల రోజులకిందట ఈ గెస్ట్ హౌస్ ను ఏపీ ప్రభుత్వం అటాచ్  చేస్తూ సీఐడీకి అనుమతి ఇచ్చింది.  ఈ గెస్ట్ హౌస్ ను  జప్తు చేసేందుకు అనుమతివ్వాలని  ఏపీ సీఐడీ   ఏసీబీ కోర్టులో  పిటిషన్ దాఖలు  చేసింది.   రాజధాని  భూ సేకరణ నుండి  మినహాయించినందునే లింగమనేని గెస్ట్ హౌస్ నపు  చంద్రబాబుకు కేటాయించారని  ఏపీ సీఐడీ కోర్టులో వాదించింది.   సీఆర్‌డీఏ అలైన్ మెంట్,  మాస్టర్ ప్లాన్ విషయంలో అవకతవకలు  జరిగాయని సీఐడీ  న్యాయవాది పేర్కొన్నారు.  క్విడ్  ప్రో కో లో భాగంగానే  లింగమనేని గెస్ట్ హౌస్ ను చంద్రబాబుకు కేటాయించారని  సీఐడీ వాదించింది. 


 అయితే  ఈ విషయమై  క్విడ్ ప్రో కో జరిగిందని  ఆధారాలను సీఐడీ  అందించలేదని  లింగమనేని రమేష్ బాబు తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్ అలైన్‌మెంట్లలో అవకతవకలకు పాల్పడ్డారని మంగళగిరి ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.   సీఎంగా చంద్రబాబు, మంత్రిగా నారాయణ పదవుల దుర్వినియోగానికి, క్విడోప్రోకోకు పాల్పడ్డారన్న కేసుల విచారణ నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్లలో అవకతవకలు జరిగాయని, దానికి బదులుగా చంద్రబాబు కరకట్టపై లింగమనేని గెస్ట్ హౌస్ పొందారని ప్రభుత్వం అభియోగం మోపింది. చట్టాలు, కేంద్ర విజిలెన్స్ కమిషన్ మార్గదర్శకాలను, సాధారణ ఆర్థిక నియమాలను ఉల్లంఘించినట్టు ప్రభుత్వం ఆరోపిస్తోంది.                                             


తమ పదవులను ఉపయోగించుకుని బంధువులకు, స్నేహితులకు ప్రయోజనాలు కల్పించారని ప్రభుత్వం అభియోగం మోపింది. వ్యాపారి లింగమనేనికి అనుకూలంగా వ్యవహరించి.. ప్రతిఫలంగా గెస్ట్ హౌస్ తీసుకున్నారని ఇది క్విడ్ ప్రో  కో కిందకు వస్తుందని సీఐడీ..కేసు నమోదు చేసి అటాచ్ మెంట్ కోసం ప్రభుత్వానికి లేఖలు రాసింది.ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.